Road Accident | నైరుతి బంగ్లాదేశ్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ప్రయాణికులు గాయపడ్డారు. 60 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు భండారియా సబ్ డిస్ట్రిక్ట్ నుంచి నైరుతి డివిజనల్లోని హెడ్క్వార్టర్స్ బరిషాల్కు వెళ్తున్న సమయంలో ఝల్కరి జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడిందని పేర్కొన్నారు. 17 మంది మృతదేహాలను వెలికి తీశారని, భారీ వర్షాలతో చెరువు నిండిందని.. క్రేన్ల సహాయంతో బస్సును వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో 65 మంది ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి మాట్లాడుతూ.. తాను డ్రైవర్ దగ్గరి సీటులో ఉన్నానని, బస్సు నడిపే సమయంలో అజాగ్రత్తగా ఉన్నాడని పేర్కొన్నారు. క్లీనర్తో తన సహాయకుడితో మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించాలని సూచించాడని సదరు వ్యక్తి తెలిపారు. ప్రమాదంలో తన తండ్రి చనిపోయాడన ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తన సోదరుడి జాడ కనిపించడం లేదని వాపోయాడు.