హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నారు. 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో సాయం డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ.1153.50 కోట్లు జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఓ వైపు వర్షాలు కురవడంతో రైతులు వానాకాలం సీజన్కు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం సాయం ఖాతాల్లో జమ చేస్తుండడంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు సాగు పనులను మరింత ముమ్మరం చేస్తున్నారు. రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రెండు విడుతల్లో రూ.10వేల చొప్పున ప్రభుత్వం సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకుల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడంతో పాటు సాగు పనుల్లో అన్నదాతలు బిజీబిజీగా ఉన్నారు.