ప్రతి దేశంలో కార్మిక చట్టాలు ఉంటాయి. అవి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తుంటాయి. కార్మిక చట్టం ప్రకారం.. ఆ దేశ ప్రభుత్వం కార్మికల హక్కులను, వాళ్లకు కావాల్సిన సౌకర్యాలకు కల్పించాల్సిందే. మన దేశంలో కూడా కార్మిక చట్టం ఉంది. దాని ప్రకారమే ఏ కంపెనీ అయినా ఉద్యోగులను నియమించుకుంటుంది.
సాధారణంగా ఉద్యోగులకు.. ప్రైవేటు అయినా ప్రభుత్వ ఉద్యోగులు అయినా వారంలో ఒక రోజు సెలవు ఉంటుంది. దాన్నే వీకాఫ్ అంటారు. చాలామందికి ఆదివారం సెలవు ఉంటుంది. ఆదివారం కూడా పనిచేసే కంపెనీలు అయితే.. వారంలో ఏదో ఒక రోజును వీకాఫ్గా ఇస్తుంటాయి. ఐటీ కంపెనీలు అయితే వారానికి 5 రోజులే పని చేస్తాయి. శనివారం, ఆదివారం సెలవులే.
అయితే.. బెల్జియం అనే దేశంలో వారానికి నాలుగు రోజులే పని చేయాలట. తాజాగా అక్కడి ప్రభుత్వం కార్మిక చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అంటే వారంలో మూడు రోజులు సెలవులే అన్నమాట.
ఒకసారి తమ షిఫ్ట్ పూర్తయ్యాక బాస్ ఫోన్ చేసినా. మెసేజ్ చేసినా.. ఏదైనా పని చెప్పినా చేయాల్సిన అవసరం లేదట. అటువంటి కొత్త చట్టాన్ని బెల్జియం ప్రభుత్వం తీసుకొచ్చింది.
రెండు సంవత్సరాలు మనం చాలా కష్టాలు అనుభవించాం. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు.. వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ చెప్పుకొచ్చారు.
అయితే.. ఈ చట్టంలో కొన్ని కండిషన్లు ఉన్నాయి. మూడు రోజుల వీకెండ్ కావాలంటే.. మూడు రోజులు సెలవులు కావాలనుకున్న ఉద్యోగులు.. తమ షిఫ్ట్ సమయాన్ని పొడిగించుకోవాల్సి ఉంటుంది. వారంలో కనీసం 38 గంటలు పనిచేస్తేనే అదనంగా మరో వీకాఫ్ వస్తుంది.
దీని వల్ల.. ఉద్యోగులు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. పిల్లలతో సరదాగా గడిపే సమయం దొరుకుతుంది.. అని బెల్జియం కార్మిక శాఖ మంత్రి డెర్మాగ్నె చెప్పారు.
20 మంది ఉద్యోగుల కంటే ఎక్కువ ఉన్న కంపెనీలన్నీ ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని ఈ చట్టం ఉద్యోగులకు ఆప్షనల్ అని.. అవసరం ఉండే ఉద్యోగులు 4 రోజులు పని విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.