బ్రస్సెల్స్: గత రెండేండ్లుగా కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న ప్రజలను మరో వైరస్ భయాందోళనలకు గురిచేస్తున్నది. ఆఫ్రికన్ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వైరస్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. దీంతో మరోసారి జనాలు ఇండ్లకు పరిమితమయ్యేలా చేస్తున్నది. యూరోపియన్ దేశమైన బెల్జియంలో (Belgium) మంకీపాక్స్ కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. వైరస్ సోకినవారికి 21 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. దీంతో మంకిపాక్స్ బాధితులకు క్వారంటైన్ అమలుచేస్తున్న తొలి దేశంగా నిలిచింది.
దేశంలో ఇప్పటివరకు 14 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఓడరేవు పట్టణమైన అన్ట్వెర్ప్లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులు ఆ పట్టణంతోనే ముడిపడి ఉన్నాయని, బాధితులంతా అన్ట్వెర్ప్లో జరిగిన ఓ వేడుకకు హాజరయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా పాజిటివ్ వచ్చినవారికి 21 రోజుల క్వారంటైన్ను తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు.
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వణికిస్తున్నది. 12 దేశాల్లో ఈ తరహా కేసులు వెలుగు చూశాయని, ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఐరోపాలోనే 20 మందికి వైరస్ సోకిందని తెలిపింది.