Lottery Jackpot | బెల్జియంలోని ఓ కుగ్రామానికి చెందిన వారు చందాలు వేసుకున్నారు. లాటరీ టికెట్లు కొన్నారు. అదృష్టం బాగుండి తాజా డ్రాలో ఆ గ్రామస్తులకే జాక్పాట్ తగిలింది. ఇంకేముంది ఒక్కొక్కరి ఖాతాల్లోకి రూ.7.27 కోట్లు జమయ్యాయి. లాటరీ పుణ్యమా అని ఈ గ్రామస్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడంతో వారంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్నారు.
బెల్జియం ఆంట్వెర్స్ ప్రావిన్స్లోని ఓ కుగ్రామం ఒల్మెన్. ఈ గ్రామానికి చెందిన ఓ 165 మంది చందాలు వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. తాజాగా తీసిన లాటరీ డ్రాలో ఈ గ్రామస్తులకే జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.1,200 కోట్లు వారు గెలుచుకున్నారు, దాంతో ఒక్కక్కరి ఖాతాలోకి రూ.7.27 కోట్లు వచ్చి చేరాయి. కొన్నేండ్లుగా ఒల్మెన్ గ్రామస్తులు ఇలాగే ఉమ్మడిగా యూరోమిలియన్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి వీరి అదృష్టం వరించడంతో ఒల్మెన్ గ్రామస్తులు కాస్తా కోటీశ్వరులైపోయారు. ఈ వార్తను నేషనల్ లాటరీ సంస్థ ధృవీకరించింది.