Nepal floods : నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. ఇలాంటి సమయంలో మానవత్వంతో, బాధ్యతతో వ్యవహరించాల్సిన నేపాల్ ప్రజలు కొందరు తమ స్వార్ధాన్ని బయటపెడుతున్నారు. తాజాగా ఒక నిర్లక్ష్యపు ఘటన వెలుగు చూసింది. నేపాల్లో ఒక బ్యాంకుకు చెందిన లాకర్ కొట్టుకురాగా.. అందులోంచి భారీగా నగదును స్తానికులు దోచుకున్నారు.
అయితే, వారి నుంచి తర్వాత పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపాల్లోని దాడింగ్ జిల్లా, గల్చి రూరల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రుసువాలో వరద సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో ఒక బ్యాంకుకు సంబంధించిన లాకర్ కూడా కొట్టుకుపోయింది. ఈ లాకర్ త్రిశూలి నది వద్దకు చేరింది. దీంతో స్థానికులు ఈ లాకర్ బయటకు తీశారు. అందులోని 92,68,505 నేపాలీ రూపాయలు (రూ.58 లక్షల భారత కరెన్సీ)ని స్థానికులు దోచుకున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లాకర్ నుంచి నగదు కొట్టేసిన 29 మంది నిందితుల్ని అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనలో ఎవరైనా ఉన్నారా.. ఇంకా నగదు మిగిలి ఉందా అనే ఘటనలపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నేపాల్ వరదల్లో 600 మందికిపైగా మరణించగా, 2,500 మంది గల్లంతయ్యారు. వీరిలో 537 మంది వరకు విదేశీయులున్నారు. ఇందులో 320 మంది భారతీయులు.