Tarique Rahman : బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం సాధించింది. దీంతో ఈ పార్టీ తరఫున తారిఖ్ రహమాన్ ప్రధానిగా ఎన్నికవుతారు. అయితే, ఒకప్పుడు దేశ బహిష్కరణకు గురైన తారిఖ్.. బంగ్లాదేశ్ తిరిగొచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన ప్రధాని పదవి చేపట్టబోతుండటం విశేషం. తారిఖ్ రహమాన్ 17 ఏళ్లు దేశ బహిష్కరణకు గురై, బ్రిటన్లో ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో దేశానికి తిరిగొచ్చారు.
రహమాన్ బంగ్లా మాజీ ప్రధాని ఖాలిదా జియా తనయుడు. ఆమె అధికారంలో ఉన్న 2002-2006 కాలంలో రహమాన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలొచ్చాయి. దీంతో తన తల్లి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అతడిపై అవినీతి ఆరోపణలు రావడంతో 2007లో అప్పటి ప్రభుత్వం అరెస్టు చేసింది. 17 నెలలు జైలులో ఉన్నాడు. తర్వాత దేశ బహిష్కరణకు గురి కావడంతో బ్రిటన్ వెళ్లిపోయారు. తన తల్లి మరణంతో 17 ఏళ్ల తర్వాత గత ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ తిరిగొచ్చాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన తల్లి మరణం తర్వాత ఆయన ఆ పార్టీ బాధ్యతలు చేపట్టారు. గురువారం జరిగిన ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించారు. తన పార్టీని విజయపథంలో నడిపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. డార్క్ ప్రిన్స్గా పిలిచే అతడు తన తల్లి ప్రధానిగా ఉన్నప్పుడు షాడో పీఎంగా వ్యవహరించారు.
ఇండియాతో వైఖరి ఎలా ఉంటుంది..?
బీఎన్పీ గతంలో ఇండియాతో వ్యతిరేక వైఖరి అవలంబించింది. ఆమె తల్లి ప్రధానిగా ఉన్న సమయంలో ఇండియాకు వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంది. భారత వ్యతిరేక శక్తులకు ఆమె ఆశ్రయం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. వ్యాపార, వాణిజ్య పరమైన అంశాలు, జల వివాదాల్లో ఇరు దేశాల మధ్య అనేక విబేధాలు తలెత్తాయి. అయితే, ఇప్పుడు ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనేది కీలకం. ఈ అంశంపై తారిఖ్ భిన్నంగా వ్యవహరించవచ్చని విశ్లేషకుల అంచనా. సమ్మిళిత బంగ్లాదేశ్ అంటూ ఆయన కొత్త నినాదం అందుకున్నారు. అంటే ఎవరితో శతృత్వం లేకుండా వ్యవహరిస్తామని చెప్పారు. దీంతో ఆయన ఇండియాతో ఎక్కువ విబేధాలు తెచ్చుకోకపోవచ్చని అంచనా.
ఇండియాకు బంగ్లాదేశ్తో ఇప్పుడు సంబంధాలు బలపడటం చాలా కీలకం. రెండు దేశాల మధ్య దాదాపు 4,000 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు భద్రత, శాంతి భద్రతలు, వ్యాపార, వాణిజ్య సంబంధాలు, బంగ్లాదేశ్లో హిందువుల భద్రత వంటి అనేక అంశాల్లో ఇరు దేశాలు సమన్వయంతో పని చేయాల్సి ఉంది.