ఢాకా: బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సుమారు 11.96 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పార్టీలకు చెందిన 1,500 మంది అభ్యర్థులతోపాటు 436 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
ప్రతిపక్షం బీఎన్పీ ఎన్నికలను బహిష్కరించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాటుచేశారు. అయినప్పటికీ దేశంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఢాకాలో రైలుకు నిప్పంటించిన విషయం తెలిసిందే. బీఎన్పీ కార్యకర్తలు నాలుగు పోలీంగ్ బూతులపై బాంబు దాడులు చేశారు. కాగా, ప్రధాని షేక్ హసీనా మరోసారి అధికారంలోకి రానున్నారని పరిశీలకు అంటున్నారు. ఆమె 2008 నుంచి బంగ్లా ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించనట్లయితే వరుసగా నాలుగోసారి ప్రధాని అవ్వనున్నారు.