Bangladesh Elections : ఏడాదిన్నర నుంచి తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ (Bangladesh) లో ఇవాళ సార్వత్రిక ఎన్నికల (Parliamentary Elections) పోలింగ్ జరుగుతున్నది. ఈ 13వ సార్వత్రిక ఎన్నికల్లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు (Chief Adviser) మహ్మద్ యూనస్ (Muhammad Yunus) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢాకా (Dhaka) లో ఆయన ఓటు వేశారు.
సరిగ్గా ఏడాదిన్నర క్రితం షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి బంగ్లాదేశ్ తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో ఇవాళ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారు. 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమంతో అవామీ లీగ్ నేతృత్వంలోని హసీనా ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ పాలనను మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పర్యవేక్షిస్తూ వస్తున్నది.
ఇప్పుడు ఈ ఎన్నికలతో ఢాకాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 299 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్పై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఈసారి ప్రధాన పోటీ.. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్పీ), షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని జమాత్-ఎ-ఇస్లామీ కూటమి మధ్యే ఉంది.
విద్యార్థుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేషనల్ సిటిజన్ పార్టీ కూడా జమాతే కూటమిలో ఉంది. ఈ ఎన్నికలతోపాటు కీలక రాజ్యాంగ సంస్కరణలపైనా రిఫరెండం జరగనుంది. హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ పార్టీ జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే మైనారిటీలపై దాడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని హిందువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.