Dipu Chandra Das : బంగ్లాదేశ్లో హిందువు అయిన దీపుచంద్రదాస్ను అక్కడి అల్లరి మూకలు ఎంత దారుణంగా హత్య చేశాయో తెలిసిందే. అతడిపై దాడి చేసి, సజీవ దహనం చేశారు. బంగ్లాదేశ్లోని మిమెన్సింగ్ జిల్లాలో డిసెంబర్ 18న ఈ ఘటన జరిగింది. హత్య జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అతడి కుటుంబానికి పరిహారం ప్రకటించింది.
అది కూడా రెండు రోజుల్లో అక్కడ జాతీయ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిహారం ప్రకటించింది. దీని ప్రకారం.. దీపుదాస్ కుటుంబానికి 25 లక్షల టాకాలు (స్థానిక కరెన్సీ) అందజేస్తారు. ఈ డబ్బును పునరావాస సహాయం కింద అతడి కుటుంబం ఇల్లు నిర్మించుకోవడానికి వాడుకోవాలి. నేషనల్ హౌజింగ్ అథారిటీ ఆధ్వర్యంలో, తారకండా ఐరాస సంస్థ పర్యవేక్షణలో 25 లక్షల టాకాలతో ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తారు. దీంతోపాటు అతడి తండ్రి, భార్యకు 10 లక్షల టాకాలు ఆర్థిక సాయంగా, నగదు రూపంలో అందజేస్తారు. అలాగే ఐదు లక్షల టాకాలు అతడి కూతురు పేరుమీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ఈ పరిహారం ప్రకటించిన సందర్భంగా అక్కడి ఎడ్యుకేషన్ అడ్వైజర్ అక్బర్ మాట్లాడుతూ.. దీపుదాస్ హత్యలాంటి ఘటనలకు సమాజంలో తావులేదన్నారు.
అతడి కుటుంబానికి అవసరమైన సాయం అందించి, అండగా ఉంటామని ప్రకటించారు. ఇలాంటి హత్య ఘటనలు జాతికి అవమానకరం అన్నారు. ఇక.. బంగ్లాలో వరుసగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం ఒక హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు.