Social Media | సిడ్నీ, నవంబర్ 8: పిల్లల మానసిక ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్న సోషల్ మీడియాపై ఆంక్షలు విధించాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది. 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్టు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ గురువారం ప్రకటించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ నెలలోనే ఈ అంశంపై చట్టం చేయనున్నట్టు వెల్లడించారు. 16 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకే అప్పగించనున్నామని, ఈ బాధ్యత తల్లిదండ్రులు, పిల్లలది కాదని ఆయన స్పష్టం చేశారు. వయో పరిమితికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి.
పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు వారి చదువులపై కూడా సోషల్ మీడియా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా తీసుకుంటున్న నిర్ణయాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. ఆస్ట్రేలియా నిర్ణయం ‘గొప్ప అడుగు’ అని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేశాలు సైతం పిల్లల సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 15 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి పొందాలని, పిల్లల వయసును సోషల్ మీడియా వేదికలు ధ్రువీకరించుకోవాలని గత ఏడాది ఫ్రాన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా వినియోగానికి కనీస వయసును 15 ఏండ్లుగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవల నార్వే ప్రకటించింది.