కాన్బెర్రా: భారత్ నుంచి వెళ్లే విమానాలపై ఆస్ట్రేలియా తాత్కాలికంగా విధించిన నిషేధం ఈ అర్ధరాత్రితో ముగియనున్నది. ఈ రోజు (మే 14) అర్ధరాత్రి నుంచి భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టంచేశారు.
అయితే, ఆ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి విమాన సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ఠ తనిఖీ వ్యవస్థ ఉంటుందన్నారు. క్వారెంటైన్ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందని మోరిసన్ తెలిపారు. తద్వారా మూడో వేవ్ రాకుండా నిలువరించగలిగామని అభిప్రాయపడ్డారు.
మే 3న భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఆస్ట్రేలియా చరిత్రలో తొలిసారి అక్కడి ప్రభుత్వం తమ దేశ పౌరుల ప్రయాణాలపై కఠిన నిబంధనలు విధించింది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ఆస్ట్రేలియన్లపై తాత్కాలికంగా నిషేధం ప్రకటించింది.