వాషింగ్టన్: అమెరికాలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ఉప ప్రధాని బర్నాబీ జాయిస్ (Barnaby Joyce) కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన ఐసోలేషన్ ఉన్నారు. అధికారిక ప్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో ఉన్న జాయిస్కు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు ప్రకటించారు. స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారని తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన అత్యున్నత నాయకుల్లో కరోనా సోకిన మొదటి వ్యక్తిగా నిలిచారు. కాగా, బ్రిటన్లోనే తనకు కరోనా సోకి ఉండొచ్చని జాయిస్ భావిస్తున్నారు.
బ్రిటన్ పర్యటన ముగించుకున్న జాయిస్ గత మంగళవారం అమెరికాకు చేరుకున్నారు. లండన్లో ఆయన బ్రిటన్ క్యాబినెట్ మినిస్టర్లు డొమినిక్ రాబ్, గ్రాంట్ షాప్స్తో సమావేశమయ్యారు. యూకే నుంచి వచ్చేటప్పుడు తనకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు. అయితే అమెరికాకు వచ్చిన తర్వాత సర్ది వంటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. దీంతో వైద్యుల సూచన మేరకు పదిరోజుల పాటు ఐసోలేషన్ ఉంటున్నానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా మంత్రులతో సమావేశాలను రద్దు చేసుకున్నానని చెప్పారు. లండన్ పర్యటన సందర్భంగా జాయిస్ క్రిస్మస్ షాపింగ్ చేయడం గమనార్హం.