స్వేచ్ఛా పోరాటానికి, దురాక్రమణ పర్వానికి మధ్య సాగుతున్న పోరాటం రసకందాయంలో పడింది. ఎవరికీ తలవంచని గడ్డగా పేరొందిన పంజ్షీర్ ప్రావిన్సును తాలిబన్లు అష్టదిగ్బంధనం చేస్తుండటంతో.. ఉత్తర కూటమి (పంజ్షీర్ సేనలు) ప్రతివ్యూహాన్ని రచించింది. పొరుగున ఉన్న బఘ్లాన్ ప్రావిన్సులో ఎవ్వరూ ఊహించని విధంగా తాలిబన్లపై మెరుపుదాడులు జరిపింది. ఈ ఘటనలో ఏకంగా 300 మంది తాలిబన్లు హతమైనట్టు సమాచారం. థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే ట్విస్టులను తలదన్నేలా ఉన్న ఈ ఘటనలతో ప్రపంచదేశాలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.
తాలిబన్లకు చావుదెబ్బ
బఘ్లాన్ ప్రావిన్సులోని అండరాబ్ జిల్లాలో ఉత్తర కూటమికి, తాలిబన్లకు మధ్య సోమవారం ఉదయం భీకర ఘర్షణలు జరిగాయని.. ఈ ఘటనలో 300 మంది తాలిబన్లు హతమయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తాలిబన్ దళంలోని ఎక్కువ మంది సభ్యులు పంజ్షీర్కు తరలివెళ్తున్నారని తెలుసుకున్న ఉత్తర కూటమి సేనలు.. అండరాబ్ జిల్లాలో మోహరించిన కొద్దిపాటి తాలిబన్లపై సరైన సమయంలో చాకచక్యంగా ఈ దాడులు జరిపాయని సమాచారం. తాలిబన్లపై సేనల దాడులు చేసే సమయంలో పౌరులు కూడా సాయపడ్డట్టు తెలుస్తున్నది. మరోవైపు, తాలిబన్లు, వారి వ్యతిరేకుల మధ్య జరిగే ఘర్షణల్లో జోక్యం చేసుకోబోమని రష్యా వెల్లడించింది.
అష్టదిగ్బంధనం..
పంజ్షీర్ ప్రావిన్సును తాలిబన్లు చుట్టుముట్టారు. లోయతో పాటు, ప్రావిన్సు అన్ని దిశల్లో తమ దళాల్ని మోహరించినట్టు తాలిబన్ నేతలు ప్రకటించారు. అయితే, పంజ్షీర్ వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, వాహనాలతో లోయను ఇప్పటికే వేలాది మంది తాలిబన్లు చుట్టుముట్టినట్టు అఫ్గానిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు, తనకు తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సాలేహ్ ధ్రువీకరించారు. తాలిబన్లు ఎంతగా భయాందోళనలకు గురిచేసినా.. ఎట్టిపరిస్థితుల్లో తలవంచేది లేదని ఉత్తర కూటమి ప్రకటించింది. మరోవైపు, సోమవారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక అఫ్గాన్ సైనికుడు మరణించాడు. ఇదిలాఉండగా.. తాలిబన్లు ఆధిపత్యాన్ని అంగీకరిస్తున్నానని అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ తెలిపారు. అయితే, తాలిబన్ సర్కార్లో తాను భాగం కాబోనని స్పష్టం చేశారు.
తీవ్ర పరిణామాలు ఉంటాయి జాగ్రత్త!
తమ పాలనను అంతర్జాతీయ సమాజం అంగీకరించాలని, అందుకే తాలిబన్లు పలు హామీలను ఇస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఈ క్రమంలో ‘తాలిబన్లను మీరు విశ్వసిస్తారా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను ఎవరినీ నమ్మబోనన్నారు. అఫ్గాన్ నుంచి చివరి అమెరికా పౌరుడిని తరలించేంత వరకు బలగాల ఉపసంహరణ చేపట్టబోయేది లేదని వెల్లడించారు. ఆగస్టు 31 తర్వాత కూడా తరలింపు ప్రక్రియ పూర్తవ్వకపోతే, బలగాలను ఉపసంహరణ ప్రక్రియను వాయిదా వేస్తామన్నారు. దీనిపై తాలిబన్ నేతలు స్పందించారు. ఆగస్టు 31లోపు అమెరికా బలగాలను ఉపసంహరించకపోతే, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని, ఈ తేదీనే వారికి ‘రెడ్లైన్’ అని హెచ్చరించారు. అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయ్యాకనే, ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందన్నారు.
అఫ్గాన్ సంక్షోభంపై అఖిలపక్షం
అఫ్గాన్లో జరుగుతున్న పరిణామాలు, ఈ వివాదంపై భారత్ వైఖరి గురించి చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు సూచించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరుగనున్నది. మరోవైపు, అఫ్గాన్లోని 75 మందిని భారత వాయుసేన విమానం సోమవారం భారత్కు తరలించింది. ఇందులో 46 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు కూడా ఉన్నారు. ఇంకా 200 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఆ దేశంలోనే ఉన్నట్టు ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ తెలిపారు. ఖతార్ రాజధాని దోహా నుంచి 146 మంది భారతీయులను సోమవారం ప్రభుత్వం నాలుగు విమానాల్లో భారత్కు తరలించింది. అఫ్గాన్లో పరిస్థితులు దిగజారడంతో వీరిని నాటో, అమెరికా సేనలు అక్కడి నుంచి దోహాకు చేర్చాయి.
తాలిబన్లకు మద్దతుగా పాక్లో ఉగ్రవాదుల ర్యాలీ
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తాయిబా సంస్థలు సోమవారం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో తాలిబన్లకు మద్దతుగా గాలిలోకి తూటాలు పేలుస్తూ ప్రదర్శనలు నిర్వహించాయి. మరోవైపు, ఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి శరణార్ధుల కమిషన్ కార్యాలయం (యూఎన్హెచ్సీఆర్) ముందు వందలాది మంది అఫ్గాన్ శరణార్ధులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కల్లోల అఫ్గాన్ నుంచి విడుదలైన తమకు వివిధ దేశాల్లో మంచి జీవన ప్రమాణాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా, కరువు, తాలిబన్ల అరాచకాలతో అఫ్గాన్లో పౌర జీవనం దుర్భరమైందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.