ముర్రీ: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. పంజాబ్లోని తీవ్రంగా కురుస్తున్న మంచులో చిక్కుకున్న కార్లలో ఉన్న 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ముర్రీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. టూరిస్టు ప్రాంతమైన ముర్రీకి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. అయితే భీకరంగా మంచు కురవడంతో.. రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. ఆ మంచులో చిక్కుకున్న కార్లలో ఉన్న 21 మంది చలి తీవ్రత తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం విపత్తు ప్రదేశంగా ప్రకటించింది. హిల్ స్టేషన్ ముర్రీలో సుమారు వెయ్యి కార్ల వరకు రోడ్డుపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఏకధాటిగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఖైబర్ ఫక్తున్సా గెయిల్యత్కు కార్ల ఎంట్రీని ఆపేశారు. మృతిచెందిన 21 మంది పర్యాటకుల్లో.. 9 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. రావల్పిండి, ఇస్లామాబాద్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు.