ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ భూకంపంతో వణికిపోయింది. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని హర్నోయ్లో గురువారం తెల్లవారుజామున 3.30 సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 5.7గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి 20 మంది చనిపోయారని, 200 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారి నసీర్ నాసర్ చెప్పారు.
కాగా, ప్రజలంతా నిద్రలో ఉండగా భూకంపం సంభవించిందని, భవనాల పైకప్పులు కూలిపడటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయని వెల్లడించారు. భూప్రకంపనలతో క్వెట్టాలో ప్రజలు భయాందోళనలకు గురైనట్లు తెలిపారు.
2015, అక్టోబర్ నెలలో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 400 మంది మృతిచెందారు. 2005, అక్టోబర్ 8న వచ్చిన భూకంపం వల్ల సుమారు 73 వేల మంది మరణించగా, 30.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.