అది ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులో ఉన్న ఫుట్బాల్ స్టేడియం. సమయం.. శనివారం రాత్రి 10 గంటలు అవుతున్నది. పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో ఆతిథ్య అరెమా ఎఫ్సీ జట్టు ఓడిపోయింది. ఆ ఓటమిని అరెమా అభిమానులు అసలే జీర్ణించుకోలేకపోయారు. చిరకాల ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడమా? అని ఆవేశానికి లోనయ్యారు. ఏం జరుగుతుందో అని అనుకొనేలోపే స్టేడియంలోకి దూసుకొచ్చారు. క్షణాల్లో ఆ స్టేడియం యుద్ధభూమిని తలపించింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తే, బయటికి వెళ్లేందుకు పరుగెత్తటంతో ఎగ్జిట్ గేట్ వద్ద తొక్కిసలాట జరిగి 125 మంది దుర్మరణం చెందారు.
జకర్తా, అక్టోబర్ 2: ఇండోనేషియాలోని ఓ ఫుట్బాల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటలో 125 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో మరో 323 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతుల్లో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. తూర్పు జావా ప్రావిన్స్లో మలాంగ్ పట్టణంలోని ఓ స్టేడియంలో శనివారం రాత్రి ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో ఆతిథ్య అరెమా ఎఫ్సీ జట్టు 3-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో అరెమా జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆ జట్టు అభిమానులు స్టేడియంలోకి దూసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో ఎగ్జిట్ గేటు నుంచి బయటకు వెళ్లే సమయంలో తొక్కిసలాట చోటుచేసుకున్నది. కొంతమంది గుంపులో ఊపిరాడక మరణించగా.. తొక్కిసలాటలో కాళ్ల కింద పడి మరికొంత మంది మరణించారు. స్టేడియం లోపల 34 మంది మరణించగా.. మిగిలిన వారు దవాఖానల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారని తూర్పు జావా పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
13 పోలీసు వాహనాలకు నిప్పు
టియర్గ్యాస్ కారణంగా ఆక్సిజన్ అందక కూడా పలువురు మరణించినట్టు తెలుస్తున్నది. చిన్నారులు, మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులు, భద్రతా సిబ్బంది దారుణంగా వ్యవహరించారని ప్రేక్షకులు వాపోయారు. ఘటన అనంతరం ప్రేక్షకులు స్టేడియంలో, బయట ఆందోళనకు దిగారు. తొక్కిసలాటకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం, లాఠీచార్జి చేయడమే కారణమని ఆరోపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన కొందరు ఆందోళనకారులు స్టేడియం బయట ఉన్న పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. 13 వాహనాలకు నిప్పు పెట్టారు.
గతంలోనూ…
తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేస్తున్నాను. మా దేశంలో ఈ ఘటనే చివరిది అవ్వాలని ఆశిస్తున్నాను. ఘటనపై విచారణకు ఆదేశించా.
-ఇండోనేషియా అధ్యక్షుడు జోకో ఇది ఫుట్బాల్ చరిత్రలో చీకటి రోజు. ఈ ఘటన ఫుట్బాల్ ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగించింది.
-ఫిఫా అధ్యక్షుడు గియాని
1964లో పెరూలో పెరూ-అర్జెంటీనా ఒలంపిక్ క్వాలిఫయర్ మ్యాచ్లో జరిగిన తొక్కిసలాటలో 320 మంది మరణించారు.
1985లో లివర్పూర్(ఇంగ్లండ్), జువేంటస్ (ఇటలీ) మధ్య బ్రస్సెల్స్లోని హేసెల్ స్టేడియంలో జరిగిన యూరోపియన్ కప్ ఫైనల్లో అభిమానుల ఘర్షణ నేపథ్యంలో ఓ గోడ కూలి 39 మంది మరణించారు.
1989లో యూకేలో షెఫీల్డ్లోని హిల్స్మరో స్టేడియంలో అభిమానుల మధ్య చెలరేగిన ఘర్షణతో 97 మంది మరణించారు.