షాంఘై: చైనాలో కార్చిచ్చు ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ దేశం కరువు హెచ్చరికలు జారీ చేసింది. యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతాల్లో పంటల్ని కాపాడుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. విపరీతమైన వేడి వాతావరణం వల్ల.. ఆ ప్రాంతంలో ఉన్న పంటలు, అడువులు అంటుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిచువాన్ నుంచి షాంఘై మధ్య ప్రాంతంలో ఉన్న యాంగ్జీ డెల్టాలో ప్రస్తుతం హీట్వేవ్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం వేడెక్కడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
సెంట్రల్ చైనాలోని జాంగ్జీ ప్రావిన్సులో యాంగ్జీ నదీ పరివాహక ప్రాంతం చాలా కీలకం. ఆ సమీపంలో ఉన్న పోయాంగ్ నదిలో నీటి శాతం దారుణంగా పడిపోయింది. చాంగ్కింగ్ ప్రాంతంలో ఉన్న 34 కౌంటీల్లోని 66 నదులు ఎండిపోయాయి. దీంతో అక్కడ నీటి ఎద్దడి ఏర్పడినట్లు ప్రభుత్వ వర్గాలు వెలల్డించాయి. చాంగ్కింగ్ ప్రాంతంలో 60 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అనేక ప్రాంతాల్లో నేలలు పగుళ్లు పట్టాయి. దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు చాంగ్కింగ్ ప్రాంతంలోనే నమోదు అవుతున్నాయి.