న్యూఢిల్లీ: ప్రముఖ హాలీవుడ్ నటి, యూఎన్హెచ్ఆర్సీ మాజీ అంబాసిడర్ ఏంజెలీనా జోలి (Angelina Jolie) ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై స్పందించారు. గాజా (Gaza) ప్రజలపై ఇజ్రాయెల్ (Israel) దమానకాండ కొనసాగుతున్నదని జబాలియా శరణార్థి శిబిరం (Jabalia refugee camp) ఉన్న అపార్ట్మెంటుపై రెండు రోజులక్రితం జరిగిన వైమానిక దాడిని ఉద్దేశించి అన్నారు. అది ఎక్కడికీ పారిపోవడానికి వీలులేక ఇరుక్కుపోయిన జనాభాపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అంటూ విమర్శించారు. దీనికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యతవహించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ ఒక ఫొటోను పోస్ట్ చేశారు.
గాజా దాదాపు రెండు దశాబ్దాలుగా బహిరంగ జైలుగా ఉందని, ప్రస్తుతం అది చాలా వేగంగా సామూహిక సమాధిగా మారుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటివరకు అక్కడ చనిపోయిన వారిలో 40 శాతం మంది అమాయక పిల్లలు ఉన్నారని వాపోయారు. కుటుంబాలకు కుటుంబాలే హత్య చేయబడుతున్నాయని తెలిపారు. యావత్ ప్రపంచం సాక్షిగా ప్రభుత్వాల మద్దతుతో పిల్లలు, మహిళలు సహా మిలియన్ల కొద్ది పాలస్తీనియన్లు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆహారం, ఔషధాలు, మానవతా సహాయం అందకుండా సమష్టిగా శిక్షించబడ్డారని విమర్శించారు. కాల్పుల విరమణకు నిరాకరించడం, ఇజ్రాయెల్, హమాస్లలో ఒకదానిపై చర్యలు తీసుకోకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అడ్డుకోవడం ద్వారా ప్రపంచ నాయకులు ఈ నేరాలకు ఉద్దేశపూర్వకంగా సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల ఏజెన్సీ అయిన యూన్హెచ్ఆర్సీకి ఏజెలీనా జోలి 20 ఏండ్లపాటు అంబాసిడర్గా పనిచేశారు. అయితే రెండేండ్ల క్రితం ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.