Myanmar weapons | మయన్మార్ సైన్యం ప్రస్తుతం ఎలాంటి యుద్ధం చేయడం లేదు. అయినప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలు తయారవుతున్నాయి. ఈ విషయాలను ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి వెల్లడించింది. ప్రజాస్వామ్య అనుకూల మయన్మార్ తన దేశవాసులను చంపేందుకు ఆయుధాల నిల్వలను వేగంగా పెంచుకుంటున్నదని ఆ నివేదికలో పేర్కొన్నది. ఈ నివేదికను సోమవారం యూఎన్ విడుదల చేసింది.
మయన్మార్పై ప్రస్తుతం పలు దేశాల ఆంక్షలు ఉన్నాయి. ఆయుధాలను కొనుగోలు చేసుకునే వీలు లేకుండా పోవడంతో తయారీపై ఆ దేశం దృష్టి సారించింది. ఆయుధాల తయారీ పనిలో భారత్, అమెరికా, జపాన్ సహా 13 దేశాలకు చెందిన కంపెనీలు మయన్మార్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం మయన్మార్పై మరో దేశం దాడి చేయడం లేదని, ఇదే సమయంలో మయన్మార్ సైన్యం కూడా ఏ దేశంపై దాడికెళ్లడం లేదని.. అయినా అక్కడ ఆయుధాలను వేగంగా తయారు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి మాజీ మానవ హక్కుల అధికారి యెంగీ లి తెలిపారు. మయన్మార్కు ఆయుధాలు విక్రయించకుండా చాలా ఏండ్లుగా ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆయుధాలను ఆ దేశం కొనుగోలు చేయలేదు. దాంతో ఆయుధాల తయారీకి పూనుకున్నట్లు తెలుస్తున్నది.
లీకైన సైనిక పత్రాలు, మాజీ సైనికుల ఇంటర్వ్యూలలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయని బీబీసీ తెలిపింది. యూఎన్ నివేదిక ప్రకారం, ఆస్ట్రియా కంపెనీ GFM Steyr నుంచి ఆయుధాల తయారీలో మయన్మార్ అత్యధిక సాయం పొందుతున్నది. దీనిపై వివరణ కోరగా ఆస్ట్రియన్ కంపెనీ నిరాకరించింది. చైనా, సింగపూర్ నుంచి రా మెటీరియల్ కొనుగోలు చేస్తున్నారు. భారత్, రష్యా కంపెనీల నుంచి ప్యూజులు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు అందుతున్నాయి. జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, అమెరికా నుంచి యంత్రాలు వస్తున్నాయి. ఇలా పలు కంపెనీలు మయన్మార్కు సాయం చేయడంలో సింగపూర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు.