మాస్కో: ఉక్రెయిన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణులను రష్యా పరీక్షించింది. హైపర్సోనిక్, క్రూయిజ్, అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణులను శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ప్రణాళిక విన్యాసాల్లో భాగంగా తాజాగా ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్లు రష్యా తెలిపింది. ఈ క్షిపణులు తమ లక్ష్యాలను పక్కగా ఛేదించాయని, వాటి సామర్థ్యాన్ని చాటాయని రష్యా రక్షణ వర్గాలు తెలిపాయి. టీయూ-95 బాంబర్లు, సబ్మెరైన్ల నుంచి మిస్సైల్స్ టెస్ట్లను నిర్వహించినట్లు ప్రకటించాయి. ‘ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం శత్రువుపై మా సైనిక దళాల వ్యూహాత్మక పనితీరును పరిపూర్ణం చేయడం’ అని చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు. తాజా సైనిక విన్యాసాల గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఆయన టీవీలో వివరించారు. వ్యూహాత్మక విన్యాసాలను రెండు దశల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కాగా, రష్యా సందర్శనకు వచ్చిన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో కలిసి పుతిన్ ఈ సైనిక విన్యాసాలను కంట్రోల్ రూమ్ నుంచి వీక్షించారు. సైనిక కమాండ్లు, పోరాట యూనిట్లు, యుద్ధ నౌకలు, వ్యూహాత్మక క్షిపణి వాహకాల సంసిద్ధత కోసం, వ్యూహాత్మక అణు, అణుయేతర బలగాల సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణుల పరీక్షకు అధ్యక్షుడు పుతిన్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది.