బ్యాంకాక్: తీవ్ర వాయు కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని, కళ్లు మండుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వెళ్ల వద్దని ఆ దేశం సూచించింది. థాయ్లాండ్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. గాలి నాణ్యత సూచీలు దిగజారాయి. ప్రధానంగా రాజధాని బ్యాంకాక్, పొరుగున ఉన్న ప్రావిన్సులలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగింది. బ్యాంకాక్లో పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటరుకు 70.5 మైక్రోగ్రాములుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన స్థాయి కంటే 14 రెట్లు ఎక్కువగా ఇది ఉంది. దీంతో ఊపిరి పీల్చుకోలేక పోతున్నామని, కళ్లు మండుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ముందున్నవి సరిగా కనిపించడం లేదని వాహనాలు నడిపే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వాహనాల ఉద్గారాలు, వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వచ్చే పొగ, వాతావరణ పరిస్థితుల వల్ల గాలి నాణ్యత సూచీలు దిగజారినట్లు థాయ్లాండ్ కాలుష్య నియంత్రణ విభాగం తెలిపింది. వాయు కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు చేపడుతున్నట్లు చెప్పింది. మరోవైపు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఇంటి నుంచే పని చేయాలని, బయటకు వెళ్లవద్దని, బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆ దేశ అధికారులు సూచించారు.