మాస్కో : ఉక్రెయిన్పై రష్యా దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా సాగుతున్న యుద్ధ వ్యతిరేక ఆందోళనలపై రష్యా ఉక్కుపాదం మోపింది. నిరసనకారుల గొంతునొక్కి అణిచివేతకు తెగబడుతోంది. పుతిన్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొన్న 5000 మందిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. మరోవైపు ఉక్రెయిన్పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. ఖర్కీవ్ నగరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. బాంబు దాడులు, కాల్పుల మోతతో ఉక్రెయిన్ భీతిల్లుతుండగా అక్కడి నుంచి పౌరులను ఖాళీ చేయించే ప్రక్రియలో భాగంగా పలు మానవతావాద కారిడార్లను తెరుస్తున్నట్టు రష్యన్ ఆర్మీ ప్రకటించింది.
జనావాసాలు, ఆయిల్ డిపోలపై రష్యన్ దాడులు కొనసాగుతుండటంతో ఉక్రెయిన్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం చర్చలు జరిపారు. మోదీ దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్స్కీతో ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్లో ప్రస్థుతం ఉన్న పరిస్థితిపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియను ప్రధాని మోదీ ప్రశంసించారు.
యుద్ధాన్ని నిలిపివేసే దిశగా మాస్కోతో చర్చలు జరిపేందుకు జెలెన్స్కీ చొరవను మోదీ మెచ్చుకున్నారు. భారతీయుల తరలింపు ప్రక్రియలో ఉక్రెయిన్ సహకరించిన తీరును ప్రశంసిస్తూ.. అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ ధన్యవాదాలు చెప్పారు. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల తరలంపులోనూ ఉక్రెయిన్ సహకరించాలని జెలెన్స్కీని ఆయన కోరారు.