Shivamogga | శివమొగ్గ, మే 5: కూలిన కోటను పునర్నిర్మించుకునే ప్రయత్నం ఒకరిది. కష్టపడి నిర్మించుకున్న కోటను పదిలం చేసుకోవాలనే తపన మరొకరిది. వరుస ఓటములకు ప్రతీకారం తీర్చుకోవాలనే పంతం ఒకరిదైతే.. ఓటమి ఎరుగని నేతగా నిలవాలనే తాపత్రయం మరొకరిది. ఈ హోరాహోరీ పోరుకు వేదికైంది కర్ణాటకలోని శివమొగ్గ లోక్సభ స్థానం. ఇక్కడి నుంచి బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప కుమారుడు, సిట్టింగ్ ఎంపీ రాఘవేంద్ర బరిలో ఉండగా, కాంగ్రెస్ తరపున మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కూతురు, కన్నడ హీరో శివ రాజ్కుమార్ సతీమణి గీత శివరాజ్కుమార్ పోటీ చేస్తున్నారు. బీజేపీ రెబల్ అభ్యర్థిగా ఆ పార్టీ బహిష్కృత నేత, మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప పోటీ చేస్తున్నారు. శివమొగ్గ స్థానంలో ఈసారి కచ్చితంగా గెలవాలని గీత శివరాజ్కుమార్, నాలుగోసారి విజయం సాధించాలని రాఘవేంద్ర గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
బంగారప్ప కుటుంబ పంతం
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం 2009కి ముందు వరకు ఎస్ బంగారప్పకు కంచుకోటగా ఉండేది. ఆయన ఇక్కడి నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే, 2009లో యెడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ స్థానం యెడియూరప్ప కుటుంబం వశమైంది. అప్పటి నుంచి వరుస ఎన్నికల్లో బంగారప్ప కుటుంబం ఇక్కడ వరుస ఓటములను చవిచూసింది. నాలుగుసార్లు ఓడిన స్థానంలో ఈసారి కచ్చితంగా గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న గీతా శివరాజ్కుమార్ పట్టుదలగా ఉన్నారు.
కంచుకోటను కాపాడుకునే పనిలో రాఘవేంద్ర
గతంలో సులువుగానే విజయం సాధించినా ఈసారి మాత్రం విజయం కోసం రాఘవేంద్ర చెమటోడ్చాల్సి వస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వరుసగా 15 ఏండ్లుగా గెలవడం వల్ల సహజంగా వ్యక్తమయ్యే ప్రజా వ్యతిరేకత, వరుస ఓటముల వల్ల గీతా శివరాజ్కుమార్పై ప్రజల్లో సానుభూతి రాఘవేంద్రకు మైనస్గా మారింది. అయితే, ఇక్కడ పొత్తు వల్ల జేడీఎస్ ఓట్లు కలిసొస్తున్నాయి. కాగా, బీజేపీ రెబల్ అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప.. రాఘవేంద్ర ఓట్లు చీల్చే అవకాశం ఉంది. మొత్తంగా శివమొగ్గలో ఈసారి బీజేపీ – కాంగ్రెస్ మధ్య, అంతకంటే ముఖ్యంగా రెండు బలమైన రాజకీయ కుటుంబాల ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది. మే 7న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి.