టెహ్రాన్, ఫిబ్రవరి 23: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇరాన్పై అమెరికా సైనిక దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ తన దేశం మనుగడ కోసం సిద్ధమవుతున్నారు. రాజకీయ నిర్మాణం, మనుగడ, యుద్ధ పరిస్థితుల నిర్వహణ బాధ్యతలను ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతాధికారి 67 ఏండ్ల అలీ లారీజానీకి అప్పగించినట్లు సమాచారం.
సుప్రీం నాయకుడిపై దాడి లేదా హత్య జరిగిన సందర్భంలో దేశాన్ని నడిపే బాధ్యతను లారీజానీ చేపట్టే అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్ఎన్సీఎస్) కార్యదర్శిగా అలీ లారీజానీ ప్రస్తుతం పనిచేస్తున్నారు. దేశ భద్రత, విదేశాంగ విధాన నిర్ణయాల పూర్తి బాధ్యత ఎస్ఎన్సీఎస్పైనే ఉంది. సుప్రీం నాయకుడు అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుగా అలీ లారీజానీ పనిచేశారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగినపుడు జనవరి నుంచి దేశ భద్రతకు సంబంధించిన బాధ్యతలను ఆయనే చూసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్సీజీ) వ్యవస్థాపక సభ్యుడైన లారీజానీ ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్కి సారథ్యం వహించారు.
ఖమేనీని, ఆయన కుమారుడిని అంతమొందించేందుకు ట్రంప్ ఆదేశాలు జారీచేసినట్టు అమెరికా అధికారులను ఉటంకిస్తూ యాక్సియోస్ ఓ కథనం ప్రచురించింది. కాగా, ఇరాన్పై అమెరికా దాడులు చేసే అవకాశం ఉండటంతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో వెంటనే దేశాన్ని వీడాలని టెహ్రాన్లోని భారత ఎంబసీ తాజాగా సూచనలు జారీచేసింది.