వాషింగ్టన్: ఇరాక్లోని హెజ్బొల్లా (Hezbollah) మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఉత్తర ఇరాక్లో హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడ్డారు. దాంతో తమ అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు సైనికులు హెజ్బొల్లాపై దాడులకు దిగారని అమెరికా డిఫెన్స్ సెక్రెటరీ లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.
‘ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూప్కు చెందిన మూడు స్థావరాలపై ఇరాక్లోని మా బలగాలు దాడులకు పాల్పడ్డాయి. కచ్చితమైన లక్ష్యాలను ఎంచుకుని వరుస దాడులు చేశాం. ఇరాక్, సిరియాల్లో మా బలగాలపై ఇటీవల మిలిటెంట్లు తరచుగా దాడులకు దిగుతున్నారు. దీనికి ప్రతిగా అధ్యక్షుడి ఆదేశాలతో మిలిటెంట్ల స్థావరాలపై మేం దాడులు చేశాం’ అని అమెరికా రక్షణ శాఖ తెలిపింది.
కాగా, ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్న హమాస్తో పాటు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్న హౌతీ మిలిటెంట్లు, ఇరాక్లోని హెజ్బొల్లా మిలిటెంట్ల వెనుక ఇరానే ఉందని అమెరికా ఆరోపిస్తున్నది. అయితే ఇప్పటికే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది.