ఖాట్మండు: పెను ప్రమాదం తప్పింది (major tragedy averted). ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్లైన్స్ విమానాలు ఢీకొనడం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. పొరుగు దేశమైన నేపాల్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ ఏ 320 విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు చేరుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన ఢిల్లీ, ఖాట్మండు విమానం కూడా అదే సమయంలో ఆ ఎయిర్పోర్ట్కు వచ్చింది. ఎయిర్ ఇండియా విమానం 19,000 అడుగుల ఎత్తు నుంచి ల్యాండ్ అవుతుండగా, నేపాల్ ఎయిర్లైన్స్ విమానం కూడా 15,000 అడుగుల ఎత్తులో అదే ప్రాంతంపైన గాలిలో ఎగురుతున్నది. ఈ నేపథ్యంలో ఈ రెండు విమానాలు అత్యంత దగ్గరగా వచ్చి దాదాపుగా ఢీకొనబోయాయి.
కాగా, రాడార్ ద్వారా గమనించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేశాయి. దీంతో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం వెంటనే 7,000 అడుగుల ఎత్తుకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. నేపాల్ పౌర విమానయాన అథారిటీ (CAAN) ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా ఈ విషయాన్ని ఆదివారం తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అజాగ్రత్తగా ఉండి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మరోవైపు ఎయిర్ ఇండియా సంస్థ ఈ సంఘటనపై ఇంకా స్పందించలేదు.