వాషింగ్టన్, మే 28: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన న్యూక్లియర్ స్టెల్త్ బాంబర్ ‘బీ-21 రైడర్’ చిత్రాలను అమెరికా వాయుసేన తొలిసారిగా విడుదల చేసింది. ఈ యుద్ధ విమానానికి క్షిపణులతోపాటు అణ్వస్ర్తాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్నది. వచ్చే ఏడాది నుంచి అమెరికా చేపట్టనున్న వాయు సేన ఆపరేషన్లలో ‘బీ-21 రైడర్’ విధుల్లో చేరనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ స్టెల్త్ బాంబర్ను అమెరికా రక్షణకు వాయుసేన వెన్నెముకగా భావిస్తున్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ స్టెల్త్ బాంబర్ను గత ఏడాది ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్ ఎయిర్ఫోర్స్ బేస్లో పరీక్షలు జరుపుతున్న సమయంలో బీ21 రైడర్ ఫొటోలను తీసినట్టు తెలుస్తున్నది. డిజైన్ చేసేటప్పుడు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగానే బీ-21 రైడర్ పనిచేస్తున్నదని ఇటీవల సెనేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కమిటీ ముందు అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి ఆండ్రూ హంటర్ వెల్లడించారు.
శత్రువుల రాడార్కు చిక్కకుండా బీ-21 రైడర్ను అమెరికా డిజైన్ చేసిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అటు ఉక్రెయిన్, ఇటు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటున్నది. ఈ క్రమంలో తమ ఉనికికి ప్రమాదం ఏర్పడితే, అణ్వాయుధాలను ఉపయోగించేందుకు వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా ‘బీ-21 రైడర్’ చిత్రాలను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.