వాషింగ్టన్: గత మూడేళ్లగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి అన్ని దేశాల్లో లక్షల సంఖ్యలో జనం (Covid-19 deaths) మరణించారు. ప్రస్తుతం కూడా భారత్తో సహా పలు దేశాల్లో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్, మానవ శరీరంపై దాని ప్రభావంపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే చాలా మరణాలు కరోనా వైరస్ వల్ల కాదని, మరో ఇన్ఫెక్షన్ దీనికి కారణమని కొత్త అధ్యయనం సూచిస్తున్నది. కరోనా సోకి తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్లపై చికిత్స పొందిన వారిలో ఎక్కువ శాతం, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్లు అమెరికా పరిశోధకులు తెలిపారు. కరోనా బారిన పడిన రోగుల్లో ఊపిరితిత్తులకు సంబంధించిన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (న్యుమోనియా) చాలా సాధారణమని పేర్కొన్నారు. వెంటిలేషన్ అవసరమయ్యే దాదాపు సగం మంది రోగులను ఈ ఇన్ఫెక్షన్ ప్రభావితం చేస్తుందని వెల్లడించారు.
కాగా, పూర్తిగా చికిత్స అందించని సెకండరీ బ్యాక్టీరియల్ న్యుమోనియానే కరోనా రోగుల అధిక మరణాలకు ఏకైక కారణమని అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్శిటీకి చెందిన ఫీన్బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ బృందం తెలిపింది. తమ ఫలితాల నిర్ధారణకు మెషిన్ లెర్నింగ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను పరిశోధకులు వినియోగించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించిన సుమారు 585 మంది రోగుల ఊపిరితిత్తుల నమూనాలను ఏఐ ద్వారా విశ్లేషించారు. వీరిలో 190 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. వెంటిలేటర్పై చికిత్స పొందిన ఈ రోగులు తీవ్ర న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యం వల్ల చనిపోయినట్లు గుర్తించారు.
మరోవైపు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (న్యుమోనియా)ను నిర్ధారించేందుకు కార్పెడైమ్ (CarpeDiem) అనే కొత్త మెషిన్ లెర్నింగ్ విధానాన్ని పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. ఒకే విధమైన లక్షణాలతో ఐసీయూలో చికిత్స పొందిన రోగుల ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ డేటాను ఈ ఏఐ ద్వారా గ్రూపింగ్ చేసి విశ్లేషించారు. వెంటిలేటర్ అనుబంధ న్యుమోనియా (వీఏపీ) కోసం అందించే చికిత్స ఫలించకపోవడమే తీవ్రమైన న్యుమోనియా ఉన్న రోగుల మరణాలకు కారణమన్నది తమ అధ్యయనంలో గుర్తించినట్లు రచయిత బెంజమిన్ సింగర్ తెలిపారు. కేవలం కరోనా వైరస్ వల్ల సంభవించిన మరణాల రేటు చాలా తక్కువని తమ డేటా ద్వారా తెలిసిందన్నారు.
మొత్తం మీద ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స సందర్భంగా కరోనా రోగులు సెకండరీ న్యుమోనియా బారిన పడటం వల్లనే మరణాలు ఎక్కువగా సంభవించాయని ఈ పరిశోధకులు తెలిపారు. అంతే తప్ప వైద్యులు పేర్కొన్నట్లుగా ‘సైటోకిన్ స్ట్రోమ్’ (ఊపిరితిత్తులు, కిడ్నీలు, బ్రెయిన్పై ప్రభావం) వల్ల కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న వారు సెకండరీ న్యుమోనియాకు చికిత్స పొంది ఉంటే వారు జీవించే అవకాశాలు ఎక్కువని విశ్లేషించారు. ఈ పరిశోధన అంశాలను జర్నల్ ఆఫ్ క్లీనికల్ ఇన్వెస్టిగేషన్లో ప్రచురించారు.