Iran vs Israel : అగ్రరాజ్యం అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశ్చిమాసియా (West Asia) లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని, ఇరాన్ పోర్టుల (Iran ports) ను దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Centrel Command) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్పై పరిమిత స్థాయి సైనిక దాడులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై దాడికి సిద్ధమవుతోంది.
ఇరాన్ను ఆర్థికంగా, సైనికపరంగా నలువైపులా నిర్బంధించి, సముద్ర మార్గాలపై పూర్తి నియంత్రణ సాధించాలని ట్రంప్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా మిత్రదేశాలతో కలిసి నౌకాయాన భద్రతను పటిష్ఠం చేసే అంశంపై అగ్రరాజ్యం చర్చలు జరుపుతోంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై విరుచుకుపడేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఇప్పటికే సైన్యాన్ని ఆదేశించారు.
ఇరాన్పై దాడుల పునరుద్ధరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే తుది నిర్ణయం కోసం ఇజ్రాయెల్ వేచి చూస్తోంది. ఒకవేళ ఈలోగా ఇరాన్ తమపై ఏవైనా దాడులకు పాల్పడితే, ఆ ప్రతిస్పందన ఊహించని రీతిలో ఉంటుందని ఇజ్రాయెల్ సైన్యం గట్టి హెచ్చరికలు చేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు విఫలం కావడానికి అమెరికా మొండివైఖరే కారణమని ఆయన ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇస్లామాబాద్ ఒప్పందం వరకు వెళ్లినప్పటికీ, చివరి నిమిషంలో అమెరికా అతివాద లక్ష్యాలతో వెనక్కి తగ్గిందని మండిపడ్డారు.
దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు విఫలమవడం దురదృష్టకరమని అరాఘ్చీ పేర్కొన్నారు. శత్రుత్వమే అమెరికా లక్ష్యమైతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితితో పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది.