Sheikh Hasina : బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కు మరో అవినీతి కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పూర్బాచల్ న్యూ టౌన్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢాకా (Dhaka) లోని ప్రత్యేక కోర్టు (Special court) ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది.
ఇదే కేసులో హసీనా సోదరి షేక్ రెహానాకు ఏడేళ్లు, ఆమె మేనకోడలు, బ్రిటిష్ ఎంపీ తులిప్ సిద్ధిఖీకి రెండేళ్ల జైలుశిక్షను కోర్టు ఖరారు చేసింది. ఢాకా స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎండీ రబియుల్ ఆలం ఈ తీర్పును ప్రకటించారు. విచారణ సందర్భంగా నిందితులు ముగ్గురూ కోర్టుకు హాజరుకాలేదు. కేసులో మరో 14 మంది నిందితులకు కూడా తలా ఐదేళ్ల జైలు శిక్షపడింది.
దోషులైన 17 మందికి లక్ష బంగ్లాదేశ్ టాకాల చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ ఈ భూ కేటాయింపుల వ్యవహారంపై మొత్తం ఆరు కేసులు దాఖలు చేసింది. కాగా, ఇదే తరహా అవినీతి ఆరోపణలపై గత నవంబర్ 27న కూడా మరో కోర్టు హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అదేవిధంగా అల్లర్ల సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చి వందలాది మరణాలకు కారణమయ్యారన్న కేసులో ఆమెకు మరణశిక్ష కూడా విధించారు. తాజా తీర్పుపై షేక్ హసీనా కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. తమపై మోపిన అవినీతి ఆరోపణలన్నీ నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని ఓ ప్రకటనలో ఖండించారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏసీసీని నియంత్రిస్తోందని ఆరోపించారు.
పక్షపాత సాక్ష్యాలతో మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారని వారు విమర్శించారు. కనీసం మా వాదన వినిపించే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ కూడా ఈ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించింది.