వాషింగ్టన్: ఉక్రెయిన్లోని బుచ్చా మారణకాండ నేపథ్యంలో అమెరికా మరిన్ని తక్షణ చర్యలకు దిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కుమార్తెలపై ఆంక్షలను కఠినతరం చేయనున్నది. రష్యాకు చెందిన బిలియనీర్ల జాబితాలో ఇప్పుడు పుతిన్ కుమార్తెలు కూడా చేరనున్నారు. పుతిన్ మొదటి భార్య లుదిమిలా ష్రిబనివాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కాటరినా టికనోవా, మారియా వొరొన్సోవాలపై ఆంక్షలను విధించేందుకు యురోపియన్ యూనియన్ ఇప్పటికే సిద్ధమైంది. పుతిన్ ఫ్యామిలీ గురించి బయట ఎక్కువగా విషయాలు తెలియదు.
వొరొన్సోవాకు నోమికో అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ సెయింట్ పీటర్స్బర్గ్లో క్యాన్సర్ చికిత్సా బిల్డింగ్ను నిర్మిస్తోంది. టికనోవాకు మాస్కో యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. పుతిన్ కూతుళ్లపై ఆంక్షలు కొనసాగించాలంటే ఈయూ సభ్య దేశాలు దానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. పుతిన్ ఫ్యామిలీతో పాటు మరికొంత మంది రష్యా సంపన్నులపై యురోపియన్ యూనియన్ ఆంక్షలు విధించే ప్రయత్నాల్లో ఉంది. బుచ్చా మారణకాండలో సుమారు 320 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ నగర మేయర్ తెలిపారు.