ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని హిందూ విద్యార్థులపై (Hindu students) దాడి జరిగింది. హోలీ (Holi) వేడుకలను ముస్లిం విద్యార్థులు అడ్డుకోవడంతో సుమారు 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు. లాహోర్లోని పంజాబ్ యూనివర్సిటీ లా కాలేజీ వద్ద ఈ సంఘటన జరిగింది. సోమవారం సుమారు 30 మంది హిందూ విద్యార్థులు హోలీ జరుపుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇస్లామీ జమియాత్ తుల్బా (ఐజేటీ)కు చెందిన కార్యకర్తలు హోలీ జరుపుకోకుండా హిందూ విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ఇది ఘర్షణకు దారి తీయగా 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు.
కాగా, హోలీ వేడుకల కోసం యూనివర్సిటీ అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకున్నప్పటికీ ముస్లిం విద్యార్థులు బలవంతంగా అడ్డుకున్నారని హిందూ విద్యార్థులు ఆరోపించారు. తమపై జరిగిన దాడిని నిరసిస్తూ వీసీ కార్యాలయం వద్ద నిరసన చేయగా సెక్యూరిటీ గార్డులు కూడా కొట్టారని వాపోయారు. ఈ నేపథ్యంలో ఐజేటీ, సెక్యూరిటీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని హిందూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ సంఘటనలో తమ ప్రమేయం లేదని పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఐజేటీ ప్రతినిధి ఇబ్రహీం షాహిద్ తెలిపారు. అలాగే లా కాలేజీ గార్డెన్లో హోలీ జరుపుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పంజాబ్ యూనివర్సిటీ ప్రతినిధి చెప్పారు. హిందూ విద్యార్థులు హోలీని లోపల జరుపుకుని ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదన్నారు. వారిపై దాడి జరిగిన సంఘటనపై దర్యాప్తునకు వీసీ ఆదేశించినట్లు వెల్లడించారు.