జెనీవా: ఆఫ్ఘనిస్థాన్లో మహిళల పరిస్థితి దయనీయంగా మారుతున్నదని, తాలిబాన్ల దురాక్రమణలతో అఫ్గానిస్థాన్ నియంత్రణ కోల్పోతున్నదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తంచేశారు. తాలిబాన్లు తక్షణమే దాడులను నిలిపివేయాలని సూచించారు. బలప్రయోగం సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరిని చేస్తుందని ఆయన హెచ్చరించారు.
‘ఆఫ్ఘనిస్థాన్ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికే ఈ తరహా ఘర్షణలను చవిచూసిన దేశం మరోసారి క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంది. ఇది అక్కడి ప్రజలకు తీరని విషాదం. ఆఫ్ఘన్ ప్రయోజనాల కోసమైనా తాలిబాన్లు వెంటనే ఈ దాడులను నిలిపివేయాలి. విశ్వాసంతో చర్చలు జరపాలి. బలప్రయోగం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది సరైన మార్గం కాదు. అది సుదీర్ఘమైన అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. ఆఫ్ఘన్ను ఒంటరిని చేస్తుంది. అధికారం కోసం యుద్ధమార్గాన్ని అవలంబిస్తున్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం స్పష్టమైన సందేశం ఇవ్వాలి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు.
అగ్రరాజ్య సేనలు హఠాత్తుగా ఆఫ్ఘన్ను వీడటంతో తాలిబాన్లు తమ ఉనికి చాటడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే 60 శాతానికి పైగా దేశం వారి వశమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరో వారంలో దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకుంటామని వాళ్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే వాళ్లు కాబూల్ సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో ప్రజల హక్కులు అణచివేతకు గురైనట్లు నివేదికలు వెలువడుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తున్న వార్తలపై గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో మహిళలు, పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని మానవ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారనే నివేదికలతో కలత చెందాను. ఈ పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. పౌరులపై దాడులకు తెగబడటం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. అది యుద్ధనేరానికి ఏ మాత్రం తీసిపోదు’ అని గుటెరస్ హెచ్చరించారు.