తాలిబన్ రాజ్యం ఆప్ఘనిస్థాన్ను ఇటీవల భారీ భూకంపం బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 1600 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ దేశంలో గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇంతటి భూకంపం రాలేదు.
ఈ క్రమంలో ఆప్ఘాన్ ప్రభుత్వం ముందుకొచ్చి అమెరికాకు కొత్త డిమాండ్ వినిపించింది. తాలిబన్లు ఆప్ఘాన్ను స్వాధీనం చేసుకోవడంతో జప్తుచేసిన ఆ దేశపు నిధులను విడుదల చేయాలని కోరింది. కాబూల్లో విలేకరులతో మాట్లాడిన తాలిబన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖి ఇదే విషయాన్ని చెప్పారు.
‘‘ఈ కష్టకాలంలో ఫ్రీజ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ ఆస్తులను విడుదల చేయాలని, ఆఫ్ఘాన్ బ్యాంకులపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికాను కోరుతున్నాం. ఇలా చేస్తే సహాయం చేసే ఏజెన్సీలు ఆఫ్ఘనిస్తాన్కు సహకారం అందించడం సులభం అవుతుంది’’ అని చెప్పారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు.
ఆప్ఘనిస్తాన్కు చెందిన మొత్తం 9 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను అమెరికా ఫ్రీజ్ చేసింది. వీటిలో 7 బిలియన్ డాలర్లను విడుదల చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. ఈ సొమ్మును ఆప్ఘాన్లో హ్యుమేనిటేరియన్ సహకారానికి, 9/11 బాధితులకు అందించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.