కాబూల్: ఒక భారీ స్టేడియం.. 80 వేల మందికి పైగా హాజరైన జనం.. అందరూ ఉత్కంఠగా చూస్తుండగా 13 ఏండ్ల బాలుడి చేతిలోని గన్ నిప్పులు కక్కి ఎదురుగా బంధించి ఉన్న వ్యక్తి గుండెల్లోకి దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే కూలిపోయాడు. చుట్టూ ఉన్న వ్యక్తుల్లో కొందరు భక్తితో నినాదాలు చేయగా, కొందరు హాహాకారాలు చేశారు. తాలిబన్ పాలిత అఫ్ఘానిస్థాన్లో మంగళవారం ఒక బహిరంగ మరణ శిక్ష అమలు సందర్భంగా ఈ దృశ్యం చోటుచేసుకుంది.
మంగల్ అనే వ్యక్తి తూర్పు అఫ్ఘానిస్థాన్లోని ఖోస్ట్లో 13 మంది సభ్యులున్న కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. అందులో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. కేసును విచారించిన సుప్రీం కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. బాధిత కుటుంబానికి చెందిన 13 ఏండ్ల బాలుడు.. దోషి మంగల్ను తుపాకితో కాల్చి మరణ శిక్షను అమలుపర్చాడు.