న్యూయార్క్, ఫిబ్రవరి 18: వచ్చే కొద్ది వారాల్లో తనఖాలో ఉన్న తమ గ్రూప్ కంపెనీల షేర్లను విడిపిస్తామని, 1.2 బిలియన్ డాలర్ల విలువైన రెండు గ్రూప్ కంపెనీల బాండ్లకు ముందస్తుగా చెల్లింపులు చేస్తామంటూ అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగేషిందర్ సింగ్, కార్పొరేట్ ఫైనాన్స్ హెడ్ అనుపమ్ మిశ్రాలు ప్రకటించారు. అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లలో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్లను స్వాంతనపర్చేదిశగా ఆ మదుపుదార్లతో కాన్ఫెరెన్స్ కాల్స్ను ఏర్పాటు చేయడానికి గ్రూప్ పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్ని నియమించుకుంది. అవి బాండ్ ఇన్వెస్టర్లతో ఫిబ్రవరి 16న ఒకటి, ఫిబ్రవరి 21న మరోటి కాల్ మీట్స్ను ఏర్పాటుచేశాయి. తాజాగా జరిగిన మీట్లో అదానీ గ్రూప్ అధికారులిరువురూ మాట్లాడుతూ విదేశీ కరెన్సీ బాండ్లను రీఫైనాన్స్ చేసుకుని ముందస్తుగా చెల్లిస్తామన్నారు. 2024 సెప్టెంబర్లో మెచ్యూర్కానున్న అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ బాండ్లకు చెల్లింపులు చేసే ప్రణాళికను ఈ ఆర్థిక సంవత్సరం (2023 మార్చి) ముగిసినంతనే వెల్లడిస్తామన్నారు.
బాండ్స్లో 200 ఫండ్స్ పెట్టుబడులు
అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో విదేశాల్లో ట్రేడవుతున్న అదానీ కంపెనీల డాలర్ బాండ్లు తీవ్రంగా పతనమయ్యాయి. ఈ బాండ్లలో దాదాపు 200 ఫండ్స్ పెట్టుబడి చేశాయి. ఆ ఫండ్స్ ఆందోళనల్ని తొలగించేదిశగా ఏర్పాటైన మీట్స్పై ఫ్రాన్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అముంది ఫిక్స్డ్ ఇన్కం హెడ్ సెర్గీ స్ట్రిగో మాట్లాడుతూ ఈ దశలో తలెత్తుతున్న ప్రశ్న కంపెనీల చెల్లింపుల సామర్థ్యం గురించి కాదని, కంపెనీ స్థాయిలో కార్పొరేట్ గవర్నెన్స్, పారదర్శకతను ప్రశ్నిస్తున్నామన్నారు.
అదానీ గ్రూప్ కంపెనీలు తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఈ అంశాలకు సమాధానమివ్వాల్సి ఉంటుందన్నారు. అదానీకి గ్రూప్ స్థాయిలో కొన్ని కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలు కన్పిస్తున్నాయని హైటాంగ్ ఇంటర్నేషనల్ అసెట్ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్కం ఇన్వెస్ట్మెంట్ హెడ్ సన్నీ జియాంగ్ చెప్పారు. అదానీ గ్రూప్లోని కొన్ని కంపెనీల క్రెడిట్ రేటింగ్ను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఎస్ అండ్ పీ, మూడీస్ ఇటీవల డౌన్గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.