వాషింగ్టన్: అమెరికాలో ఒక మహిళ.. మాజీ భర్తపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇద్దరు కన్న బిడ్డలను కాల్చిచంపుకుంది. భర్త సంరక్షణలో ఉన్న పిల్లలను చంపితే తనలో పగ చల్లారుతుందన్న దురుద్దేశంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఐదేళ్ల నాటి ఈ కేసులో తాజాగా తీర్పు వెల్లడైంది. తల్లిని దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు చెప్పింది. అయితే కోర్టు దోషిగా తేల్చినా సదరు మహిళ నేరాన్ని అంగీకరించడం లేదు. తన మానసిక పరిస్థితి బాగాలేక ఆ హత్యలు చేశానని, అవి ఉద్దేశపూర్వక నేరం కాదని అంటోంది.
కానీ, కోర్టు ఆమె వాదనను పట్టించులోకోదు. పైగా ఆమెపై రెండు హత్యలకు సంబంధించి రెండు ఫస్ట్ డిగ్రీ కేసుల నమోదుకు అనుమతి ఇవ్వాలంటూ దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన అభ్యర్థనకు కోర్టు అనుమతించింది. కాగా, 37 ఏళ్ల వెరోనికా యంగ్బ్లడ్.. 2018లో తన కుమార్తెలు బ్రూక్లిన్ యంగబ్లడ్ (5), షరాన్ క్యాస్ట్రో (15)లను హత్య చేసింది. రెండు వారాల విచారణ తర్వాత తాజాగా తీర్పు వచ్చింది. ఫెయిర్ఫాక్స్ కౌంటీ జడ్జి రాండీ బెల్లోస్ అధ్యక్షతన విచారణ జరిగింది. కోర్టు మొదటి ప్రతివాదులు, మానసిక ఆరోగ్య నిపుణులు, దర్యాప్తు అధికారుల సాక్ష్యాలను విని తీర్పు చెప్పింది. యంగ్బ్లడ్ సోదరి, మాజీ భర్త, మాజీ ప్రియుడు కూడా సాక్ష్యమిచ్చారు.
వెరోనికా యంగ్బ్లడ్ ఒక సెక్స్ వర్కర్గా పనిచేసేదని, ఈ క్రమంలో ఆమె కుటుంబసభ్యుల ద్వారా కూడా శారీరక, లైంగిక వేధింపులకు గురైందని డిఫెన్స్ అటార్నీలు కోర్టు దృష్టికి తెచ్చారు. హత్య కోసం ఆమె తన పిల్లలకు స్లీపింగ్ గమ్మీలను ఇచ్చినట్లు విచారణలో తేలింది. ముందుగా ఐదేళ్ల కుమార్తె బ్రూక్లిన్ తలపై కాల్చడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత 15 ఏళ్ల షరాన్ను వెనుక నుంచి కాల్చి, మరో రౌండ్ ఛాతిలో కాల్చి పారిపోయింది. దీనిపై షరాన్ 911కు కాల్ చేయగా పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ షరాన్ కూడా ప్రాణాలు కోల్పోయింది.