ఒకినావా, సెప్టెంబర్ 1: తూర్పు చైనా సముద్రంలో తాజాగా ఏర్పడిన బలమైన తుఫాను ‘హినమ్నర్’ చైనా, జపాన్ తీర ప్రాంతాలను వణికిస్తున్నది. జపాన్ దక్షిణ ద్వీపాలతో పాటు చైనా తీర ప్రాంతాలు, తైవాన్పై ఈ పెను తుఫాను తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. హినమ్నర్గా పిలుస్తున్న ఈ టైఫూన్ ప్రస్తుతం జపాన్లోని ఒకినావాకు తూర్పుగా సుమారు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వారం చివరకు జపాన్ ద్వీప తీర ప్రాంతాలను తాకే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. తుఫాను ప్రభావం కారణంగా గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, ఒక్కోసారి గాలుల వేగం 296 కిలోమీటర్ల వరకూ ఉంటున్నదని అమెరికాకు చెందిన యూఎస్ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ పేర్కొన్నది. ఈ టైఫూన్ను 2022లో ప్రపంచంలోనే అత్యంత బలమైన పెను తుఫానుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన గరిష్ట గాలుల వేగం ఆధారంగా హినమ్నర్ ఈ ఏడాదిలో బలమైన తుఫాన్గా మారుతుందని అంచనా వేస్తున్నట్టు జపాన్ వాతావరణ కేంద్రం కూడా పేర్కొన్నది. అయితే తీరానికి సమీపించే కొద్దీ హినమ్నర్ బలహీనపడే అవకాశం ఉన్నదని యూఎస్ జేటీడబ్ల్యూటీసీ అంచనా వేసింది.
తుఫాన్ ప్రభావం ఇప్పటికే విమాన సర్వీసులపై పడింది. ఒకినావా రీజియన్కు నడిపే అన్ని విమానాలను జపాన్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. తమ ఎనిమిది విమాన సర్వీసులను కూడా గురువారం వరకు రద్దు చేసినట్టు ఏఎన్ఏ హోల్డింగ్స్ పేర్కొన్నది. టైఫూన్ ప్రభావం ఆధారంగా ఈ వారమంతా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని ఈ రెండు విమాన సంస్థలు తెలిపాయి.