కరాచీ: గర్భవతి అయిన ఒక మహిళ ఆసుపత్రి నుంచి నవజాత శిశువును అపహరించింది. బాబుకు జన్మనివ్వాలని తన కుటుంబీకులు ఒత్తిడి చేస్తుండటంతో ఇలా చేసినట్లు పోలీసులకు చెప్పింది. పాకిస్థాన్లోని కరాచీకి చెందిన ఒక మహిళ 37 వారాల గర్భిణీ. ఆమెకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు. తనకు పుట్టబోయేది ఆడ శిశువని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకున్నది. మగ పిల్లవాడి కోసం తన భర్త, అత్త మామలు ఒత్తిడి చేయడంతో ఆసుపత్రి నుంచి పసి బాలుడ్ని అపహరించాలని నిర్ణయించుకున్నది. దీంతో ఈ నెల 23న స్థానిక మాతాశిశు ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆ మహిళ అనంతరం పసి బాలుడ్ని అపహరించి రిక్షాలో ఇంటికి వెళ్లింది. తమ శిశువు కనిపించకపోవడంతో ఆ పసి బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మహిళను గుర్తించి బాలుడ్ని స్వాధీనం చేసుకున్నారు. పసి బాలుడ్ని రూ.30 వేలకు కొన్నట్లు ఆరోపించిన ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.