లండన్, ఆగస్టు 7: గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించేందుకు వీలుగా అమెరికా, బ్రిటన్, జర్మనీకి చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సులువైన పరీక్షను అభివృద్ధి చేసింది. క్రిస్పర్జైమ్ అనే ఈ పరీక్ష.. శరీరంలోని బయోమార్కర్ల (కణాలు విడుదల చేసే సిగ్నళ్లు)ను గుర్తించడం ద్వారా పనిచేస్తుంది. కొవిడ్-19 కారక సార్స్ సీవోవీ-2 జన్యువులను గుర్తించేందుకు ఇప్పటికే ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అయితే కొవిడ్ వంటి సాంక్రమిక వ్యాధుల్లోనే కాకుండా అసాంక్రమిక వ్యాధులకు సంబంధించి కూడా బయోమార్కర్లను కణాలు విడుదల చేస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ను రక్తంలో కనుక గుర్తిస్తే ఆ వ్యక్తిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్టు నిర్ధారించవచ్చు. ఇప్పటివరకు ఆర్ఎన్ఏ లేదా డీఎన్ఏ ద్వారా వ్యాధులను గుర్తించే పరీక్షలు నియంత్రిత ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే నిర్వహించాలి. అయితే తాజా పరీక్షను గది ఉష్ణోగ్రత వద్ద కూడా నిర్వహించొచ్చు.