న్యూఢిల్లీ : కొలంబియాలో ఘోర విమాన దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఎయిర్ఫోర్స్ మిలిటరీ విమానం కుప్పకూలింది. టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 90 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది సైనికులు ఉన్నారు. పెరూ సరిహద్దుకు సమీపంలో ప్ట్యూర్టో లెగుయిజామో పట్టణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాయిటర్స్ వార్తాసంస్థ వివరాల ప్రకారం.. ఎయిర్ఫోర్స్కు చెందిన హెర్కులస్ సీ-130 ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిందని రక్షణ మంత్రి పెడ్రో శాంచెజ్ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అన్న వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.
సహాయ బృందాలను ఘటనా స్థలికి పంపామని, పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. విమాన దుర్ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఘోర ప్రమాదమని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించకూడదని ఆశిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటన జరిగి ఉండకూడదని, జవాన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చూసేందుకు మిలిటరీ సామర్థ్యాలను పెంచుతామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో మిలిటరీ రవాణా ఎయిర్క్రాఫ్ట్లలో సీ-130 పేరెన్నికగన్నది. జవాన్లు, ఆయుధాల రవాణాకు దీనిని ఉపయోగిస్తుంటారు. ఒకేసారి 19 వేల కిలోల బరువును ఇది జారవిడచగలదు. మెడికల్ ఎమర్జెన్సీ, విపత్తు ఉపశమన కార్యకలాపాలు, ఫైర్ ఫైటింగ్ వంటి వాటికీ దీనిని వాడుతారు.