న్యూఢిల్లీ: బలూచిస్తాన్(Balochistan)లో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లను పాకిస్థాన్ మిలిటరీ ఏరివేస్తున్నది. ఈ నేపథ్యంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో 92 మంది బలూచిస్తానీ మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్థాన్ మిలిటరీ పేర్కొన్నది. ఈ ఆపరేషన్లో 15 మంది సెక్యూర్టీ సిబ్బంది, 18 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు మిలిటరీ వెల్లడించింది. దాడులకు తామే పాల్పడుతున్న గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్నది. డజన్ల సంఖ్యలో సైనికుల్ని చంపినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే బలూచిస్తాన్లో రెబల్స్, మిలిటరీ మధ్య తీవ్ర స్థాయిలో ఫైరింగ్ జరుగుతున్నది.
బలూచిస్తాన్ ప్రావిన్సు రాజధాని క్వెట్టాతో పాటు సమీప నగరాల్లో జరుగుతున్న దాడులకు మిలిటెంట్లే కారణమని పాకిస్థాన్ మిలిటరీ ఆరోపించింది. బలోచిస్తాన్ బోర్డర్ సమీపంలో క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టామని, విజయవంతంగా రెబల్స్ ప్రణాళికలను దెబ్బతీసినట్లు పాక్ మిలిటరీ పేర్కొన్నది. క్వెట్టాలో కీలకమైన బిల్డింగ్లు, రోడ్లను సీజ్ చేశారు. మొబైల్ ఫోన్ సర్వీసులను నిలిపివేశారు. ఆపరేషన్ సమయంలో రైళ్ల రాకపోకలను కూడా ఆపేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు.