El Salvador | అక్కడ లోకల్ ఫుట్బాల్ టోర్నీలో భాగంగా మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. స్టేడియం పూర్తిగా నిండిపోయింది. అంతా ప్రశాంతంగా మ్యాచ్ చూస్తున్నారు. ఇంతలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం దాకా వచ్చింది. అది చూసి చుట్టుపక్కల కూర్చుని ఉన్న ఫుట్ బాల్ అభిమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక మిగతావాళ్లు కూడా లేచి పరుగులు పెట్టడం మొదలుపెట్టారు. అదే తొక్కిసలాటకు దారితీసింది.
ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వెడార్ దేశ రాజధాని సాన్ సాల్వెడార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కస్కట్లాన్ స్టేడియంలో అలియంజా, FAS జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగింది.