బీజింగ్: పుట్టినిళ్లు చైనాలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనాలో మూడో అతిపెద్ద ప్రావిన్స్ అయిన హెనాన్లో దాదాపు 90 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రావిన్స్లోని మొత్తం జనాభాలో 89 శాతం మందికి వైరస్ సోకిందని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్ హెల్త్ కమిషన్ డైరెక్టర్ కాన్ క్వాన్చెంగ్ అన్నారు. జనవరి 6 నాటికి ప్రావిన్స్లో కరోనా ఇన్ఫెక్షన్ రేటు 89.0 శాతానికి చేరిందన్నారు.
ప్రావిన్స్లో మొత్తం 9 కోట్ల 94 లక్షల మంది జనాభాలో సుమారు 8 కోట్ల 85 లక్షల మంది మహమ్మారి బారినపడ్డారని వెల్లడించారు. జ్వరం లక్షణాలతో క్లినిక్లకు వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు. కాగా, చైనాలో గత రెండేండ్లుగా కొనసాగుతున్న లాక్డౌన్ ఆంక్షలను గత నెలలో ప్రభుత్వం ఎత్తివేసింది. అదేవిధంగా విదేశాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్ తప్పనిసరి నిబంధనను కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.