Canada | టొరంటో, జనవరి 17: భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు.. భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవటంపై ఆసక్తి కనబరుస్తున్నారు. కెనడాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 2023లో 86 శాతం వరకు పడిపోయిందని ఆ దేశానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఏటా కెనడా జారీచేసే స్టూడెంట్ వీసాల్లో అత్యధిక వాటా భారతీయ విద్యార్థులదే. 2022లో కెనడా జారీచేసిన స్టూడెంట్ వీసాల్లో 41శాతం (2,25,835) భారత్కు చెందినవే ఉన్నాయి.
అయితే కొద్ది నెలల క్రితం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాల్లోనూ దౌత్య సిబ్బందిపై వేటు పడింది. దీనిపై కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ, ‘కెనడాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య హఠాత్తుగా పడిపోవటానికి కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత. కెనడా దౌత్య సిబ్బందిని భారత్ బహిష్కరించటం వల్ల, స్టూడెంట్ వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సగానికి పడిపోయింది’ అని అన్నారు. గతేడాదితో పోల్చితే భారతీయులకు కెనడా జారీచేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య 2023 నాలుగో త్రైమాసికంలో 1,08,940 నుంచి 14,910కి పడిపోయింది.