టోక్యో: వరుస భూకంపాలతో జపాన్ (Japan) వణికిపోతున్నది. సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి (Earthquakes) కంపించిందని జపాన్ వాతావరణ శాఖ (JMA) తెలిపింది. ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతోపాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది. అయితే 3 అంతకంటే ఎక్కువ తీవ్రతతో నమోదైనవే అత్యధికంగా ఉన్నాయని చెప్పింది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఆరుసార్లు శక్తివంతమైన ప్రకంపణలు వచ్చాయని పేర్కొంది.
కాగా, సెంట్రల్ జపాన్లో సోమవారం నాటి భారీ భూకంపం వల్ల ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. సునామీ రావడంతో అలలు మీటరు ఎత్తు వరకు ఎగసిపడ్డాయని, దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. వాజిమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 32,700 మందికి పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు. ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి.