Nepal Earthquake | కఠ్మండూ: హిమాలయ దేశం నేపాల్లో (Nepal) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రివేళ 11.32 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదయిందని నేషనల్ ఎర్త్క్వేక్ మెజర్మెంట్ సెంటర్ (NEMC) తెలిపింది. జాజర్కోట్ (Jajarkot) జిల్లాలోని లామిదండా (Lamidanda) ప్రాతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్లో భూకంపం రావడం ఇది మూడోసారి.
భూకంపం ధాటికి చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు 128 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల్లో జాజర్కోట్ జిల్లాకు చెందినవారు 34 మంది ఉండగా, పశ్చిమ రుకుమ్ జిల్లాలో మరో 35 మంది ఉన్నారు.
కాగా, మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్ప కమల్ (Pushpa Kamal Dahal) సంతాపం తెలిపారు. దేశంలోని మూడు భద్రతా సంస్థలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయని, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దైలేఖ్, సల్యాన్, రొల్పా జిల్లాల్లో కూడా పలువురు మృతిచెందారని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు.
నేపాల్లో గత నెల 3న 6.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీనివల్ల భారత్లోని ఢిల్లీ-రాజధాని ప్రాంతంలో కూడా కదలికలు సంభవించాయి. నేపాల్లో 2015లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వల్ల 12 వేల మంది మరణించారు. పది లక్షలకుపైగా నిర్మాణాలు ధ్వంసమయ్యాయి.
Earthquake of Magnitude 6.4 strikes Nepal: National Center for Seismology
Strong tremors felt in Delhi pic.twitter.com/iz1OGy44cG
— ANI (@ANI) November 3, 2023