కీవ్, మే 5: ఉక్రెయిన్ను హస్తగతం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో రష్యా తీవ్ర రక్తపాతానికి పాల్పడుతున్నది. తమ సేనలకు ఎదురొడ్డి పోరాడుతున్న సైనికులతో పాటు, పౌరులపై కూడా దాడులను తీవ్రం చేస్తున్నది. బుధవారం రాత్రి ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో జరిపిన ఫిరంగి దాడుల్లో 600 మంది సైనికులు, పౌరులు మరణించినట్టు రష్యా ఆర్మీ ప్రకటించింది. 61 ఆయుధ యూనిట్లు కూడా ధ్వంసమైనట్టు వెల్లడించింది. మరోవైపు, మరియుపోల్లోని అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్ స్వాధీనానికి పుతిన్ సేనలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. స్టీల్ప్లాంట్లో చిక్కుకొని గాయాలతో బాధపడుతున్న ఉక్రెయిన్ ప్రజలను కాపాడేందుకు సాయం చేయాలని అధ్యక్షుడు జెలెన్స్కీ ఐక్యరాజ్యసమితి డైరెక్టర్ జనరల్ ఆంటోనియో గుటెరస్కు విజ్ఞప్తి చేశారు. రష్యా బలగాలను ఉపసంహరించుకొంటేనే ఎలాంటి ఒప్పందానికైనా తాము సిద్ధమని, అంతకు ముందు అధ్యక్షుడు పుతిన్ తనతో చర్చించాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. రష్యా జనరళ్లను తుదముట్టించేందుకు ఉక్రెయిన్ సైన్యానికి అమెరికా కీలక సమాచారాన్ని అందిస్తున్నదని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది.
ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి సాయం
క్షిపణిలు, బాంబులతో ఒకవైపు ఉక్రెయిన్ ప్రధాన నగరాలను ధ్వంసం చేస్తున్న రష్యా సేనలు.. ప్రజలకు అవసరమైన ఆహారాన్ని కూడా దొంగిలిస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ పుతిన్ బలగాలు 4 లక్షల టన్నుల ధాన్యం, 1.5 కోట్ల టన్నుల మొక్కజొన్నను దొంగిలించినట్టు గురువారం ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు, యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు జెలెన్స్కీ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫాంను ప్రారంభించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి 6.5 బిలియన్ డాలర్ల మానవతా సాయం అందించేందుకు ఇంటర్నేషనల్ డోనర్స్ కాన్ఫరెన్స్లో నిర్ణయం తీసుకొన్నారు.