వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో డౌన్టౌన్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. తూటాలకు ఆరుగురు బలవగా.. పది మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ఘటన చోటు చేసుకున్నది. ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు వినిపించాయని శాక్రమెంటో పోలీస్ చీఫ్ కాథీ లెస్టర్ మీడియాకు
తెలిపారు.
శబ్దాలు విని సంఘటనా స్థలానికి వెళ్లిన సమయంలో వీధిలో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారని, ఆరుగురు మృతి చెందారని పేర్కొన్నారు. అయితే, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న శబ్దం వినిపిస్తుండగా.. అనేక మంది ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అయితే, తర్వాత క్షతగాత్రుల్ని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. కాల్పులకు తెగబడ్డది ఎవరు? కారణాలేంటో తెలియరాలేదు. కాల్పుల ఘటనపై శాక్రమెంటో మేయర్ డారెల్ స్టెయిన్బర్గ్ విచారం వ్యక్తం చేశారు. కాల్పులు బాధాకరమన్నారు. విషాధ సంఘటనపై
మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.